ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల మీద
లాఠీ విరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని,
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం మానుకోవాలని కోరుతూ ఉస్మానియా
విద్యార్థి, నిరుద్యోగ ఐకాస అసెంబ్లీకి ర్యాలీ చేపట్టింది. అయితే
పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీని దిగ్బంధం చేశారు. శాంతియుతంగా ర్యాలీ
చేస్తున్న విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టారు. దాంతో
విద్యార్థులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
శాంతియుతంగా ర్యాలీ చేస్తూ అసెంబ్లీకి వెళ్తున్న తమమీద ఈ దౌర్జన్యం ఏమిటని
పోలీసులను ఆగ్రహంగా ప్రశ్నించారు. అయితే విద్యార్థుల ప్రశ్నలకు పోలీసులు
లాఠీలతో సమాధానం చెప్పారు. ప్రశ్నించినందుకు బహుమతిగా లాఠీలతో
విద్యార్థులను చావబాదారు. ఆడపిల్లలని కూడా చూడకుండా విద్యార్థులను
చావబాదారు. తమ అక్కచెల్లెళ్ళను, అన్నదమ్ములను పోలీసులు చావబాదుతూ ఉండటం
చూసి విద్యార్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసు నిర్బంధాన్ని
తప్పించుకుని అసెంబ్లీ వైపు వెళ్ళడానికి విద్యార్థులు తీవ్రంగా
ప్రయత్నిస్తున్నారు. పోలీసులు కూడా విద్యార్థులను అడ్డుకోవడానికి తమ
బలాన్ని, లాఠీలను, బూటు కాళ్ళను ఉపయోగిస్తున్నారు. దీంతో ఉస్మానియా
యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. కొంతమంది విద్యార్థుల తలలు
పగిలినట్టు తెలుస్తోంది. తమను లాఠీలతో దారుణంగా చితకబాదుతున్న పోలీసుల
మీదకు విద్యార్థులు రాళ్ళతో దాడి చేశారు.
No comments:
Post a Comment