Saturday, 13 September 2014

మెదక్‌ ఉప ఎన్నిక...45 శాతం పోలింగ్ నమోదు

సంగారెడ్డి: మెదక్‌ ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటి వరకూ మెదక్‌లో 45 శాతం పోలింగ్‌ నమోదైంది. కొన్నిచోట్ల పోలింగ్‌ సరళి మందకోడిగా కనిపిస్తోంది. సిద్ధిపేట మార్కెట్‌యార్డులోని పోలింగ్‌ కేంద్రం, భరత్‌నగర్‌ నగర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు మొరాయిండంతో కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు. ములుగు మండలం గంగాపూర్‌లో ఓటింగ్‌ వేయకుండా.. గ్రామస్తులు నిరసన చేపట్టారు. అధికారులు పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయలేదని, అందుకే తాము ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటు జిన్నారం మండలం జంగంపేట, రామాయంపేట మండలం ఝూన్సీలింగాపూర్‌లోనూ ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ కొద్దిసేపు నిలిచిపోయింది. తర్వాత కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశారు. చిన్న శంకరంపేట మండలం చందాపూర్‌లో ఈవీఎం మొరాయించడంతో కాసేపు పోలింగ్‌ నిలిచిపోయింది. గజ్వేల్‌ మండలం బంగ్లావెంకటాపూర్‌లోని పోలింగ్‌ కేంద్రంలో పరిమితి లైన్‌ దాటివచ్చిన ఓటర్లపై పోలీసులు స్వల్ప లాఠీచార్జ్‌ చేశారు. వెల్దుర్తి మండలం పెద్దాపూర్‌లో పోలింగ్‌ను గ్రామస్తులు బహిష్కరించారు. గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేకపోవడం.. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ.. పోలింగ్‌ను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. జిల్లా స్థాయి అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఓటింగ్‌లో పాల్గొనమని గ్రామస్తులు తేల్చిచెప్పారు. తుప్రాన్‌ మండలం కూచారంలో రైల్వే గేటు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు పోలింగ్‌ను బహిష్కరించారు. పాపన్నపేట మండలం కొత్తపల్లి పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయటానికి వచ్చిన మహిళ పిట్స్‌ వచ్చి కింద పడిపోయింది. తూప్రాన్ మండలం కుచారం తండాలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించారు. తమ తండాకు రోడ్డు వేయలేదంటూ స్థానికులు పోలింగ్‌ను బహిష్కరించారు. 

No comments:

Post a Comment