హనోయ్ : భారత రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆదివారం వియత్నాం చేరుకున్నారు. ఆయనకు స్థానిక నోయిబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో వియత్నాం విదేశాంగశాఖ సహాయమంత్రి డావో వియత్ రంగ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనిక దళాలు రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించాయి. సోమవారం వియత్నాం అధ్యక్షుడు ట్రాంగ్ టాన్ శాంగ్ అధికారికంగా స్వాగతం పలుకుతారు. ప్రణబ్ పర్యటనలో ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్, పెట్రో వియత్నాం సంస్థల ప్రతినిధులు చమురు అన్వేషణ ఒప్పందంపై సంతకాలు చేస్తారు. దీంతోపాటు ఎయిర్ కనెక్టివిటీపై కూడా భారత్ - వియత్నాం మధ్య ఒప్పందం జరుగనున్నది. రెండుదేశాల మధ్య రక్షణ, భద్రతా రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాల్సి ఉన్నదని ఢిల్లీ నుంచి బయలుదేరడానికి ముందు ప్రణబ్ చెప్పారు. ప్రధాని నరేంద్రమోడీ, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తదితరులు రాష్ట్రపతికి ఘనంగా వీడ్కోలు పలికారు.
No comments:
Post a Comment