Tuesday 23 September 2014

తెలంగాణ ఫాస్ట్ జీవో.. దేశ సమగ్రతకే ముప్పు : హైకోర్టు


తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశిస్తూ తీసుకొచ్చిన ‘ఫాస్ట్’ వంటి పథకం దేశ సమగ్రతకే ముప్పు అని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి ఉత్తర్వులు దేశంలో వేర్పాటువాదానికి దారితీస్తాయంటూ తెలంగాణ సర్కారుపై మండిపడింది. అసలు ఈ విషయంలో ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని తెలుగు మాట్లాడే విద్యార్థులకు ఇలాంటి పరిస్థితే వస్తే మీకు ఎలా ఉంటుందని ప్రశ్నించింది. 
 
ఈ మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. తెలంగాణలో 1956 నవంబర్ 1వ తేదీకి ముందు నుంచీ నివాసముంటున్న కుటుంబాల విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామంటూ... ‘తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్)’ పేరిట తెలంగాణ ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
ఈ మేరకు జీవో కూడా జారీ అయింది. దీనిని సవాలు చేస్తూ.. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, డొక్కా మాణిక్య వరప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. 
 
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. ‘భారతదేశం ఒక్కటే. ఇక్కడ నివసిస్తున్న వారంతా ఈ దేశ పౌరులే. పేద విద్యార్థులకు (ఎస్సీ, ఎస్సీ, బీసీల)కు ఆర్థిక సాయం చేస్తున్నామంటే మేం అర్థం చేసుకోగలం. తెలంగాణ విద్యార్థులను ఉద్దేశించి మాత్రమే ప్రభుత్వం ఎందుకు ‘ఫాస్ట్’ జీవోను తీసుకువచ్చింది..? దేశంలోని అన్ని రాష్ట్రాల విద్యార్థులకు ఎందుకు వర్తింపజేయడం లేదు. ఎందుకీ వివక్ష..? తెలంగాణ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి.’ అంటూ ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. 
 
‘మీరు జారీ చేసిన ‘ఫాస్ట్’ జీవో జాతీయ సమగ్రతను ప్రతిబింబించే విధంగా ఉందా..? మీరు ఈ జీవోను ఎలా సమర్థించుకుంటారు? ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎంత మాత్రం అభినందనీయంగా లేదు. ప్రభుత్వ చర్యలు రాజ్యాంగంలోని 19వ అధికరణకు విరుద్ధంగా ఉన్నాయి. ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు విధానాలు రూపొందించుకుంటూ పోతే... మరి ఇతర రాష్ట్రాలు కూడా చెల్లించిన పన్నుల్లో కేంద్రం నుంచి వాటా ఎలా అడుగుతారు..? మీ విధానం ద్వారా మీరు ఒక వర్గం విద్యార్థులకు రాజ్యాంగపరంగా సమకూరాల్సిన ప్రయోజనాలను కాలరాస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు మాట్లాడే విద్యార్థులందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటే మీకు ఎలా ఉంటుంది..?’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసింది. 
 
‘మనం సమైక్య రాజ్యంలో ఉన్నాం. ఆ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా..? సమైక్య రాజ్యంలో వివక్షకు తావు లేవు. స్థానికత ఆధారంగా ప్రజల పట్ల వివక్ష చూపడానికి వీల్లేదు. విధానం ఏదైనా సరే అది జాతి సమగ్రతను, సమైక్య స్ఫూర్తిని పెంపొందించేదిగా ఉండాలి. ఇటువంటి వివక్షాపూరిత విధానాలను మనం అడ్డుకోకుంటే... దుష్టశక్తులు ప్రవేశించి మన రాజ్యాంగ, సమైక్య స్ఫూర్తిని నాశనం చేస్తాయి. ప్రభుత్వాలు విధానాల రూపకల్పన చేసే ముందు జాతి సమగ్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ప్రస్తుత వ్యవహారంలో జాతి సమగ్రత లోపించినట్లు కనిపిస్తోంది..’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 

No comments:

Post a Comment