Thursday 18 September 2014

ఎపిలో సమగ్ర సర్వే: వివరాలిచ్చిన పరకాల ప్రభాకర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న మూడు రోజుల ‘సమగ్ర సర్వే' శుక్రవారం ప్రారంభమైంది. ఆదివారం సెలవు అయినప్పటికీ ఆ రోజు సర్వేలో పాల్గొనే ఉద్యోగులంతా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల సమగ్ర సర్వేను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, గీత, నేత కార్మికులకు ఇస్తున్న పింఛన్లలో చాలా వరకు బోగస్‌వి ఉన్నట్టు తేలిందన్నారు. అందువల్ల బోగస్ పేర్లను ఈ సందర్భంగా తొలిగిస్తామన్నారు. అర్హులైన వారిపేర్లను తొలిగించే ప్రసక్తే లేదని, అందువల్ల అర్హులైన వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు. పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చని, ఈ దరఖాస్తులను నియమ, నిబంధనల మేరకు పరిశీలించి, 
ఎపిలో సమగ్ర సర్వే: వివరాలిచ్చిన పరకాల ప్రభాకర్

పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. సర్వే సందర్భంగా గ్రామాలు, మున్సిపాలిటీల్లోని అన్ని గృహాలకు అధికారిక బృందాలు వెళతాయని, ప్రతి ఇంటిలో ఉండే వారి వివరాలు సేకరిస్తామని పరకాల ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం గ్రామస్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని రకాల కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామని, ఇప్పటికే 94 శాతం ఆధార్ నెంబర్లు లభించాయన్నారు. మిగతా ఆరు శాతం మందికి కూడా ఆధార్ నెంబర్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పింఛన్లు తదితర సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం 4,500 కోట్ల నుండి 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనావేశామని పరకాల తెలిపారు. ఈ మేరకు నిధులను విడుదల చేస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలతో సంబంధం ఉన్నదని తేలిన టాస్క్ఫోర్స్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ (ఓఎస్‌డి) జి. ఉదయకుమార్, ఎస్‌డిపిఓ జి.వి. రమణలను సస్పెండ్ చేశామని, వీరిపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని తెలిపారు.

No comments:

Post a Comment