తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో కింది కోర్టు విధించిన శిక్షను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది. కర్ణాటక హైకోర్టులో పేపర్ బుక్లెట్తో అక్రమాస్తుల కేసు విచారణకు సిద్ధం కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం డిసెంబర్ 18వ తేదీ వరకు గడువు విధించింది. ఆ లోపు జయలలిత కర్ణాటక హైకోర్టులో తన కేసును తేల్చుకోవాల్సి ఉంటుంది.
అక్రమాస్తుల కేసులో బెయిల్ కోరుతూ జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటీషన్పై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిపి బెయిలు మంజూరు చేసింది. ప్రధాన న్యాయమూర్తి దత్తు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం జయలలిత బెయిల్ పిటీషన్ను విచారించి, బెయిల్ను మంజూరు చేసింది. అదేసమయంలో అక్రమాస్తుల కేసులో పేపర్ బుక్లెట్తో కర్ణాటక హైకోర్టులో విచారణకు సిద్ధం కావాలాని, ఇందుకోసం ఆరు వారాల సమయమిస్తున్నట్టు ధర్మాసనం సూచన చేసింది.
కాగా, జయలలిత అక్రమాస్తుల కేసులో గత నెల 27వ తేదీన నాలుగేళ్ళ జైలుశిక్షతో పాటు.. రూ.100 కోట్ల జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. దీంతో ఆమె అప్పటి నుంచి బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో జయలలిత బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
జయలలిత తరపున ప్రముఖ న్యాయవాదులు పాలీ నారీమన్, సుశీల్ కుమార్, తులసి, రాంజెఠ్మలానీలు వాదనలు వినిపిస్తున్నారు. తమ వాదనలను కర్ణాటక హైకోర్టు పట్టించుకోలేదని వారు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
No comments:
Post a Comment