తనకు ఇష్టం లేక పోయినా బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దించాడనే పగతో ఓ మహిళా సెక్స్ వర్కర్ కానిస్టేబుల్ను హత్య చేసిన ఘటన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో వెలుగు చూసింది. జుహూ తారా రోడ్డు వద్ద ఓ గదిలో సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా నివ్వెరపరిచే ఈ విషయం బయటపడింది. దీంతో కానిస్టేబుల్ను చంపిన నేరంపై సదరు సెక్స్ వర్కర్ను అరెస్టు చేసి, విచారించగా, ఆమె తన విషాద గాథను వెల్లడించింది.
తనది బీహార్ అని, బాల్యం నుంచే సవతి తల్లి హింస పెట్టేదని, ఆ బాధలు భరించలేక 2002లో ముంబై వచ్చేశానని తెలిపింది. అప్పుడు తన వయసు 17 ఏళ్ళు అని పేర్కొంది. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్ బయట అలసటతో, ఆకలితో ఉన్న తనను ఓ మహిళ తన నివాసానికి తీసుకెళ్ళిందని చెప్పింది. అయితే, ఆమె భర్త తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి నుంచి తిరిగి సీఎస్టీకి వచ్చేశానని, అక్కడ ఓ కానిస్టేబుల్ కలిసి వసతి కల్పిస్తానని, ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికాడని వివరించింది.
అయితే, అతడు తనను ఓ వ్యభిచార గృహానికి రూ.25 వేలకు అమ్మేశాడని తెలిపింది. రెండేళ్ళ తర్వాత ఆ వ్యభిచార గృహ యజమానికి మత్తు ఇచ్చి తప్పించుకుని, బాంద్రా మురికివాడకు వచ్చినట్టు తెలిపింది. అక్కడే ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిలో చేరగా, అక్కడ పరిచయమైన సహోద్యోగిని పెళ్ళాడానని తెలిపింది. ఓ బాబు పుట్టిన తర్వాత అతడు వదిలేయగా, పొట్టకూటి కోసం తిరిగి వ్యభిచారంలోకి దిగానని వెల్లడించింది.
ఓ పర్యాయం పోలీసుల దాడిలో దొరికిపోగా, ఆ పోలీసు బృందంలో తనను బ్రోతల్కు అమ్మిన కానిస్టేబుల్ కూడా ఉన్నాడని, అతడు తన ఫోన్ నెంబర్ తీసుకుని, తరచూ లైంగికంగా వేధించేవాడని చెప్పింది. ఆ వేధింపులు భరించలేక అతడిని చంపేయాలని నిర్ణయించుకుని, ఓ కస్టమర్ సాయంతో మత్తు మందు తెప్పించానని వెల్లడించింది.
గత నెల 12వ తేదీ రాత్రి కానిస్టేబుల్కు మత్తు మందు కలిపిన డ్రింక్ తాగించి, అతను స్పృహ కోల్పోగానే గొంతు నులిమి చంపేశానని వివరించింది. అయితే, తాను కానిస్టేబుల్ను చంపిన విషయం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మరుసటి రోజు తిరిగి ఆ గది వద్దకు వచ్చి, శవాన్ని పరుపులో చుట్టి తగలబెట్టానని తెలిపింది. కిరాతక కానిస్టేబుళ్ళకు ఆ హత్య ఓ హెచ్చరికలా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ పనిచేశానని తెలిపింది.
No comments:
Post a Comment