ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మోడీ సర్కార్ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ అభియాన్, అందరికీ ఇళ్లు, స్మార్ట్ సిటీలు, హృదయ్ కార్యక్రమాల గురించి హైదరాబాద్లో జరిగిన మెట్రో పొలిస్ సదస్సులో ప్రణబ్ ముఖర్జీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పేరిట అయిదేళ్ల కోసం కేంద్రం ప్రారంభించిన కార్యక్రమంలో అందరికీ మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించాలని, 4041 పట్టణాలను పరిశుభ్రంగా మార్చాలని కంకణం కట్టుకున్నారని ప్రణబ్ గుర్తు చేశారు.
మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి ఈ లక్ష్యాన్ని నెరవేర్చడమే కేంద్ర సర్కార్ ఉద్దేశంగా ఆయన వివరించారు. మోడీ సర్కార్ చేపట్టిన అందరికీ ఇళ్లు కార్యక్రమం కూడా అత్యంత కీలకమైనదని, కొత్త మురికివాడలు ఏర్పడకుండా గృహనిర్మాణ విధానాలను ఏర్పర్చాల్సిన అవసరం ఉందని ప్రణబ్ నొక్కివక్కాణించారు. వేగవంతంగా పట్టణీకరణ జరుగుతున్న రీత్యా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్రాలకు మద్దతునిచ్చేందుకు మోడీ సర్కార్ వినూత్న పట్టణాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కూడా రాష్ట్రపతి ప్రకటించారు.
అలాగే, మోడీ డ్రీమ్ ప్రాజెక్టులో ఒకటైన దేశ వ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని కూడా ప్రణబ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. అలాగే, పట్టణ ప్రణాళిక, సుపరిపాలన, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, ఐటి రంగాలపై దృష్టి కేంద్రీకరించారని, ప్రతి ఒక్కరికీ ఐటీ ప్రయోజనాలు లభించేలా చూడడం, ప్రజల జీవన నాణ్యతను పెంచడం మోదీ సర్కార్ ఉద్దేశమన్నారు.
No comments:
Post a Comment